అమరావతి : ప్రైవేట్ బస్సుల అతివేగంగా కారణంగా ప్రయాణికులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ వాహనాలను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిస్తుండడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నాయి. నరసాపురం నుంచి బెంగళూరుకు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు తిరుపతి జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పేరూరు బండ వద్ద ముందు వెళ్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో బస్సులోని డ్రైవర్, క్లీనర్తో పాటుగా మరికొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ముందర భాగం నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్ బస్సు క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో పోలీసులు, స్థానికుల సహాయంతో బయటకు తీశారు. క్షతగాత్రులను 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఎం.ఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.