శ్రీశైలం: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంటలోని హెలిపాడ్ వద్ద రాష్ట్రపతికి ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శ్రీశైలంలో ప్రసాద్ పథకం ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తర్వాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్లోని హకీంపేటకు చేరుకుంటారు.
భ్రమరాంబ గెస్ట్హౌస్ నుంచి మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ టూరిజం శాఖ మంత్రి రోజా స్వాగతం పలికారు.
ఐదు రోజుల శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై, రాష్ట్రమంత్రి సత్యవతిరాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం దేశ ప్రథమ పౌరురాలు హెలికాప్టర్లో శ్రీశైలం బయల్దేరిన విషయం తెలిసిందే.