శ్రీశైలం ఆలయం : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం మల్లన్న స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి ప్రవేశించిన ముర్ము.. ముందుగా రత్న గర్భ గణపతిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. భ్రమరాంబ దేవికి కుంకుమార్చన చేశారు. అనంతరం ఆలయ అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.