అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని బుధవారం ఏపీ డీజీపీ (DGP) కి ఫిర్యాదు చేసినట్లు ఆయన అన్నారు. టీడీపీలో చేరాలని అడిగితే తిరస్కరించానని దీంతో అతడి అహం దెబ్బదిందని పేర్కొన్నారు. దీంతో తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నాడని సమాచారం ఉందని వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్కు, టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. వెన్నుపోటు కుటుంబం నుంచి వచ్చిన లోకేష్ కూడా తనను చంపడానికి వెనుక నుంచి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
కాపుల ఓట్ల కోసం తండ్రికొడుకులు డ్రామాలు ఆడుతున్నారని , ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు. తనకు రక్షణ కల్పించడానికి డీజీపీ సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు.