గుంటూరు: తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. సత్తెనపల్లిలో ఆయన పాదయాత్రకు సిద్ధమవగా.. అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పేరేచర్ల-కొండమోడు రహదారి విస్తరణ పనులను చేపట్టాలని డిమాండ్ చేస్తూ కోడెల శివరాం పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. సత్తెనపల్లిలోని టీడీపీ ఆఫీసు నుంచి పాదయాత్రకు బయలుదేరాలని భావిస్తున్న తరుణంలో పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
పేరేచర్ల-కొండమోడు మధ్య రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాజుపాలెం నుంచి దేవేరంపాడు వరకు పాదయాత్రకు పిలుపునివ్వగా.. టీడీపీ నేత కోడెల శివరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు పాదయాత్ర ప్రారంభించేందుకు ఎన్టీఆర్ భవన్కు వెళ్లిన కోడెల శివరాం నివాసం వద్ద, ఎన్టీఆర్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులర్పించారు.
పాదయాత్ర చేయకుండా తొలుత ఎన్టీఆర్ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే, కార్యాలయం నుంచి తప్పించుకున్న శివరాం.. తాలూకా సెంటర్కు వెళ్లి అక్కడ బైఠాయించి నిరసనకు దిగారు. కోడెల శివరాంను అరెస్ట్ చేయడంతో టీడీపీ నేతలు-పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాజుపాళెం మండల టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దేవరంపాడు కొండవీటి వాగులో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయకుండా పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.