అమరావతి : ఏపీలో ఏ ఒక్క ఉద్యోగికి జీతాలు తగ్గవని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. కొత్త పీఆర్సీ వల్ల వేతనాల్లో పెరుగుదల ఉందని స్పష్టం చేశారు. ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడు సంవత్సరాల క్రితం వరకు రాష్ట్రానికి ప్రతియేట 60వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేదని కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని మరోసారి ఉద్ఘాటించారు. గత మూడు సంవత్సరాలుగా ప్రతియేట 15 నుంచి 20వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి తగ్గిందన్నారు. పీఆర్సీ వేతనాలపై అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఉద్యోగులతో చర్చించేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ పరిస్థితుల నుంచి గట్టెక్కుతున్న తరుణంలో ప్రభుత్వంలో భాగస్వామ్యులైన ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం సరైన నిర్ణయం కాదని తెలిపారు. దయచేసి సమ్మె ఆలోచనను విరమించుకోవాలని కోరారు. ఉద్యోగుల కోసం ఎంత చేయాలో అంతచేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు , ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇవాళ జీతాలు రాని వారి ఖాతాల్లోరేపు వేస్తామన్నారు. పాత పీఆర్సీ నిన్నటికి పూర్తయిందని వెల్లడించారు.