విజయవాడ: గత 30 ఏండ్లుగా సేవలందిస్తున్న పినాకినీ ఎక్స్ప్రెస్ రైలు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. విజయవాడ రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫాం నంబర్ 1 పై కేకు కోసి మరీ రైలుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీరు విన్నది నిజంగా నిజం. పినాకినీ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ-చెన్నై మధ్య నడుస్తుంది.
విజయవాడ రైల్వే స్టేషన్లో అలంకరించిన ఇంజిన్ ప్లాట్ఫాం 1 పైకి రాగానే అక్కడ వేచి ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే టు యు అంటూ కేకలేశారు. దీంతో విషయం తెలియని మిగతా వారు తెల్లమొగమేశారు. తీరా ఆరా తీస్తే.. విజయవాడ-చెన్నై మధ్య నడిచే పినాకినీ రైలు గత 30 ఏండ్లుగా నిరంతరాయంగా సేవలందిస్తున్నది. ఈ రైలును ప్రవేశపెట్టి సరిగ్గా ఇవాల్టికి 30 ఏండ్లు పూర్తయ్యాయి. దాంతో ఈ రైలులో నిత్యం ప్రయాణించే వారు ఆ రైలు డ్రైవర్చేత కేకు కోయించారు. అనంతరం ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇంజిన్తో సెల్ఫీలు దిగి ఎంజాయ్ చేశారు. ఈ రైలును నిర్వహిస్తున్న కోచింగ్, మెకానికల్ విభాగం అధికారులు, సిబ్బందిని అభినందించారు.
పినాకిని ఎక్స్ప్రెస్ రైలు 1992 జూలై 1న ప్రారంభమైంది. విజయవాడ-చెన్నై రూట్లో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు ఎక్కువగా ఈ రైలులో ప్రయాణిస్తుంటారు. ఈ రైలు నడిచే సమయాలు అనుకూలంగా ఉండటంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ప్రయాణికులు సీజనల్ టికెట్టు తీసుకుని ప్రయాణిస్తారు. 30 ఏండ్లుగా సేవలందిస్తుండటంతో దాని సేవలకు గుర్తుగా ప్రయాణికులు కేకును కోసి పుట్టినరోజు జరుపడం పట్ల తోటి ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.