అమరావతి : ఏపీలో వైసీపీ పాలన అధ్వాన్నంగా మారుతుందని, రాష్ట్ర అభివృద్ధికి శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పరిశ్రమలకు పవర్ హాలిడేను ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, జాబ్ హాలిడేలతో జగన్ పాలన కొనసాగుతుందని ఎద్దేవ చేశారు. టీడీపీ సీనియర్నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ జగన్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు.
నిన్న జగన్ తన నిరాశ, నిస్పృహను బయటపెట్టుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పాత్ర సమర్థంగా నిర్వర్తిస్తున్నందుకే జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు . రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మూడేళ్లుగా సీపీఎస్ రద్దు చేయకపోవడం జగన్ మొదటి అద్భుతమని, ఉద్యోగులను పావుగా వాడుకుని పీఆర్సీ తగ్గించిన ఘనత జగన్దేనని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి భారం మోపడం మరో అద్భుతమని వివరించారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేని అద్భుత పాలన చూసి మేం ఏడవాలా, నవ్వలో తెలియడం లేదని పేర్కొన్నారు.