ఏపీ మంత్రులకు ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. గడప గడపకూ మన ప్రభుత్వం పేర నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ మాధవ్కు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది.
మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లాలోని హత్తిబెళగల్లోని ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తమకు రోడ్డు వేయించాలని ప్రజలు ఒక్కసారిగా డిమాండ్ చేశారు. ఆలూరు- హత్తినబెళల్ ప్రధాన రహదారిని ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని మంత్రిని నిలదీశారు. అమ్మ ఒడి డబ్బులు కూడా రావడం లేదని, అమ్మ ఒడి రాకపోయినా పర్లేదని, రోడ్డు మాత్రం వేయించాలని మంత్రిని డిమాండ్ చేశారు. అదే విధంగా మంచి నీటి సమస్యను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇక మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. తమకు రెండు నెలలుగా ఉపాధి హామీ పనుల డబ్బులు రావడం లేదని బేతంచెర్ల మండలంలో ప్రజలు నిలదీశారు. వెంటనే తమ డబ్బులు వచ్చేలా చూడాలని ప్రజలు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి అధికారులను వెంటనే పిలిపించి, వివరణ కోరారు. వారం రోజుల్లోగా డబ్బులు వస్తాయని చెప్పి, వెళ్లిపోయారు.