అమరావతి : మాజీ మంత్రి వివేకానంద(Vivekananda) హత్య అనంతరం కడప, పులివెందుల నియోజకవర్గంలో ప్రజలకు స్వేచ్ఛ కరువు అయ్యిందని వివేకా కూతురు డాక్టర్ సునీత (Sunitha) పేర్కొన్నారు. కేసు గురించి మాట్లాడడానికి నిందితులను చూసి భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం వివేకా హత్య కేసు అనంతరం ఇప్పటివరకు జరిగిన కేసు వివరాలను, అనుమానాలను వివరించారు. నిజమైన దోషులకు శిక్షపడాలనే ఉద్దేశంతో తాను న్యాయ పోరాటం చేస్తున్నానని వెల్లడించారు.
వైఎస్ జగన్ (YS Jagan) నేడు అధికారంలో ఉండికూడా బాబాయి వివేకా హత్యపై ఎందుకు నోరు మెదపడం లేదని, నిందితులను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగబోయే ఎన్నికల్లో పులివెందుల(Pulivendula), కడప(Kadapa) ప్రజలు ఆలోచించి ఓటు నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిందితులు మళ్లీ గెలుస్తే మరెంతో మంది బలి అవుతారని ఆమె అన్నారు.
వైఎస్ రాజారెడ్డి ( YS Rajareddy) నుంచి వైఎస్సార్, వైఎస్ వివేకా వరకు ప్రజలకు నమ్మకం ఉండేదని, ప్రజలు ధైర్యంగా వెళ్లి సమస్యలు విన్నవించుకుని సాధించుకునే వారని వివరించారు. వారి లక్షణాలు జగన్లో ఏ ఒక్కటి కనిపించవని దుయ్యబట్టారు. ఇలాంటి స్థితిలో మీరెలా వారసులు అవుతారని సునీత ప్రశ్నించారు. ప్రజా సమస్యలు చెప్పుకునే హక్కుకూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే వారిని పార్టీలకు అంటగట్టడం న్యాయమా అన్ని అన్నారు. టీడీపీ గాని, ఇతర ఏ పార్టీలకు మద్దతుగా మాట్లాడుతున్నట్లు చేస్తున్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు.