అమరావతి : ప్రస్తుతం సెక్యూరిటీ లేకుండానే తిరుగుతున్నానని, తనకు భద్రత ఉపసంహరించుకోవడంపై రెండ్రోజుల్లో సంచలన విషయాలు బయటపెడతానని టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు. తనకు ఎందుకు భద్రతను ఉపసంహరించాల్సి వచ్చిందో జగన్ ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనకేదన్నా జరిగితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.
పయ్యావుల కేశవ్కు కేటాయించిన గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. భద్రతపై గంటకో రకంగా పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పయ్యావుల చంద్రబాబు నివాసానికి గన్ మెన్ లేకుండానే వెళ్లారు. ఇలాఉండగా, ఓ వ్యక్తి వచ్చి తనను పరిచయడం చేసుకుని.. మీకు భద్రతగా ప్రభుత్వం కేటాయించిందని చెప్పారని.. అయితే ఆ వ్యక్తి ఎక్కడికెళ్లాడో ఇప్పటికీ తెలియడం లేదని పయ్యావుల కేశవ్ తెలిపారు. అలా వచ్చిన వ్యక్తి పోలీసా.. లేదా రౌడీనా.. అన్నది తెలియదని చెప్పారు. ఇప్పటికైతే తాను గన్మెన్ లేకుండానే బయట తిరుగుతున్నానని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల్లో సంచలనం బయటపెడతానని కేశవ్ మీడియాకు వెల్లడించారు. ఆ సంచలనం ఏంటో అని మీడియా ఎంత గుచ్చిగుచ్చి అడిగినా.. సమాధానం ఇవ్వలేదు. రెండ్రోజులు ఓపిక పట్టండి బ్రదర్ అంటూ దాటవేశారు.