అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్రలను నిర్వహిస్తున్నారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ప్రభుత్వం రైతులకు ఎలాంటి మేలు చేయకపోవడం వల్ల గుంటూరు జిల్లాలో ఏడు రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
రైతులను ఆదుకునేం దుకు ఈనెల 25న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పవన్ పర్యటించనున్నారని ఆయన వెల్లడించారు. త్వరలో గుంటూరు జిల్లాలో కూడా పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబానికి జనసేన తరఫున రూ.లక్ష సాయం అందిస్తామని ప్రకటించారు. కౌలు రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం బయటకు రానియ డం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు రైతుల కుటుంబాలను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని మనోహర్ ఆరోపించారు.