అమరావతి : ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ( Vasireddy Padma ) మరోసారి జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ( Pawan Kalyan) పై ఘాటుగా విమర్శలు చేశారు. పవన్ నటించిన ప్రేమకథల సినిమాల వల్లే టీనేజీ, మహిళల అదృశ్యానికి కారణమని గురువారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
ఏపీలో బాలికలు, మహిళలు, యువతులు అదృశ్యంపై కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రస్తావించిన విషయాన్ని పవన్కల్యాణ్ నిన్న ఏపీ మహిళా కమిషన్ను ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలదా, హోంశాఖను, డీజీపీని వివరణ కోరగలదా అంటూ ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, పరువు తీసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో మహిళల అదృశ్యంపై ఎందుకు పెదవి విప్పడం లేదని ఆమె ప్రశ్నించారు. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యంపై ఆధారాలు ఉంటే ఇవ్వాలని ఇప్పటికే పవన్కు నోటీసులు (Notice ) ఇచ్చామని ఆమె వెల్లడించారు. చంద్రబాబు హయాంలోనే మహిళలపై అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు.