హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా స్వాంతంత్య్రాలతో జీవించాలని ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికి అందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
పేద ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా జనసేన కార్యకర్తలు కృషిచేయాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన నిలిచి పోరాటాలు చేయాలని ఆయన సూచించారు. ప్రజలకు ఏది కావాలో అది తెల్సుకుని ప్రభుత్వం అమలుచేసేలా ఒత్తిడి తేవడంలో జనసేన కార్యకర్తలు ముందుండాలని కోరారు.