Pawan Kalyan | వచ్చే ఏడాదిలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, సీఎం ఎవరనేదానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎవరూ ? అన్నదానిపై చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. అందరి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. ఏపీ భవిష్యత్ కోసం పొత్తులే మార్గమన్నారు. ప్రజలతో కూర్చొని ఎలా తీసుకెళ్తే బాగుంటుందని చర్చిస్తామని మాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
అన్నీ చెప్పే చేస్తాని.. ఏదీ లోపాయికారిగా చేయనని చెప్పారు. జనసేన ఎవరికీ బీ పార్టీ కాదని.. టీడీపీ వెనుక నడవడం లేదన్నారు. టీడీపీతో కలిసి నడుస్తున్నామన్నారు. అభిమానులు, జనసైనికుల ఆత్మగౌరవాన్ని తక్కువ చేయనన్న పవన్.. ఆత్మగౌరవాన్ని కాపాడతానని హామీ ఇచ్చారు. ఏపీ భవిష్యత్ బాగుండాలంటే.. పొత్తు తప్ప మరోదారి లేదన్నారు. సింగిల్గా బరిలోకి దిగితే తప్పనిసరిగా జనసేన ఓటింగ్శాతం పెరుగుతుందన్నారు. బలమున్న స్థానాల్లో గెలవొచ్చని.. 35-40 వరకు స్థానాలు రావొచ్చన్నారు. అయితే, ఆ బలం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం సరిపోదన్నారు. అందుకే ఆ అవకాశాన్ని తీసుకోదలచుకోలేదన్నారు.
మరో ఐదేళ్లు ఆలస్యమైతే.. నిరుద్యోగులు ఉపాధి అవకాశాల కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. అందుకే తాను ఛాన్స్ తీసుకోవడం లేదన్న పవన్.. ప్రజలను గెలిపించేందుకు తనను తాను తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల గౌరవమని.. ప్రైవేటీకరణపై కేంద్రం పెద్దలతో మాట్లానన్నారు. తాను మాట్లాడిన తర్వాత అమిత్షా ప్రైవేటీకరణ ప్రాసెస్ను ఆపారన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. మార్పు కోసం వచ్చానన్నారు. ఉత్తరాంధ్ర తనకు ఇష్టమైన ప్రాంతమని.. ఇక్కడ వలసలు ఆగాలని.. తాను భావితరాల భవిష్యత్ ఆలోచిస్తున్నానన్నారు. తాను బీజేపీలో చేరితో.. నాకు కోరుకున్న పదవి ఇస్తారన్నారు. అయితే, ఏపీలో ‘అత్తారింటికి దారేదిలా.. రాజధానికిదారేది అన్నట్టుంది’ అన్నారు. ప్రజారాజ్యంలా జనసేన కనుమరు కాదని.. ఎప్పటికీ పార్టీని మనుగడలోనే ఉంచుతానన్నారు.
అభిమానం ఓట్లుగా మారకపోతే ఏం చేయలేమన్నారు. గెలిపిస్తేనే సీఎం పదవి అడిగే అవకాశం ఉంటుందన్నారు. సక్సెస్ అయినప్పుడు ఎవరూ గుర్తు పెట్టుకోరని.. కష్టం వచ్చినప్పుడు పవన్ కల్యాణ్, జనసేన గుర్తుకు వస్తాయన్నారు. తాను ఓడిపోయిన సమయంలో విశాఖ గుండెలకు హత్తుకుందన్నారు. గంజాయి, డ్రగ్స్తో వేలకోట్లు పాలకులు సంపాదించారని.. రాష్ట్రంలో అవినీతి ప్రజల భవిష్యత్ను నిర్ధేశించే ప్రమాదకర స్థాయికి వెళ్లిందన్నారు. ఉత్తరాంధ్రను వైసీపీ విముక్త ప్రాంతంగా ప్రకటిద్దామని.. జనసేన ప్రభుత్వంలో బాధ్యత, అన్నిస్థాయిల్లో అధికారం తీసుకుంటామన్నారు.