అమరావతి: జనసేన పార్టీపై కొందరు నాయకులు చేస్తున్న దుష్ఫ్రచారాలను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరి తరం కాదని, ప్రజలే పార్టీని కాపాడు కుంటారని ఆయన అన్నారు. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. పోలీసుల తీరు మారకుంటే రోడ్డుక్కుతానని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నానని పేర్కొన్నారు.
జనసేన జెండా దిమ్మలు పగులకొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. జగ్గయ్యపేటలోనూ జనసేన పతాక ఆవిష్కరణ కోసం నిర్మించుకున్న జెండా దిమ్మెను వైసీపీ నేతలు జేసీబీతో కూల్చివేశారని మండిపడ్డారు. తమ నాయకులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ అన్ని కార్యక్రమాలను ముందస్తు అనుమతితోనే చేస్తున్నారా అని ప్రశ్నించారు. పోలీసులు ధర్మాన్ని పాటించాలని సూచించారు.