విజయవాడ : గతంలో చెప్పిన విషయాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులు అందరికీ టిక్కెట్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు. టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ మేరకు చంద్రబాబు ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తామని ఇదివరకే చంద్రబాబు ప్రకటన చేశారు. ఇదే విషయాన్ని పునరుద్ఘాటించడంతో పార్టీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎనలేని పోరాటం చేస్తున్నారని, వారి సేవలను ఇకముందు కూడా పొందుతామని చంద్రబాబు చెప్పారు. అందుకని వారికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టిక్కెట్లు ఇస్తానని ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు పోరాడుతున్న తీరు పట్ల నిజంగా సంతోషంగా ఉన్నానని చెప్పి.. వారినే మరోసారి అసెంబ్లీకి పంపేలా చేద్దామని అనడంతో అక్కడ హర్షధ్వానాలు వెల్లివిరిసాయి.
1994లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొత్తం 74మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని చెప్పిన విషయాన్ని చంద్రబాబు సమావేశంలో జ్ఞాపకం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలా ప్రకటించిన 74 మందిలో ఒకరు తప్ప అందరూ తిరిగి గెలిచారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారట. ఓడిపోయిన కళా వెంకట్రావును రాజ్యసభకు పంపి ప్రమోషన్ ఇచ్చినట్లు చెప్పారంట. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల్లో 70 మంది సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వొద్దని పీకే టీం సిఫారసు చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారంటూ తన ఎమ్మెల్యేలను ప్రశంసల్లో ముంచెత్తారని సమాచారం.