అమరావతి : ఏపీలో అధికార వైసీపీ పార్టీ(YCP) అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసేందుకు కసరత్తులు ముమ్మరం చేసింది. ఈనెల 16న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్(YSR Ghat) వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. అందరికంటే ముందుగానే జాబితాను సిద్ధం చేసుకున్న జగన్ వాటిని ప్రకటించడంలో జాప్యం చేస్తూ వస్తున్నారు.
గత రెండు నెలల ముందు నుంచే సర్వే రిపోర్టు(Survey Reports) ల ఆధారంగా 50కిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేల(Sitting MLAs) స్థానాల్లో అభ్యర్థులను మార్చి ఇతరులకు సమన్వయ బాధ్యతలు అప్పగించి వారికే ఈసారి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లల్లో 151 స్థానాలను గెలుచుకోగా 25 ఎంపీ స్థానాల్లో 22 ఎంపీ స్థానాలు వైసీపీ, 3 స్థానాల్లో టీడీపీ గెలుచుకుంది.
ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, కూటమి పార్టీ జనసేనలకు చెందిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. టీడీపీ మరో ముందడుగు వేసి ఈనెల 14న రెండో జాబితాను విడుదల చేయనున్నారు. ఈ జాబితాలో కొన్ని పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని చంద్రబాబు నాయుడు బుధవారం వెల్లడించారు.