రాజమండ్రి: తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ కొనివ్వడం లేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదివే పాలిటెక్నిక్ కాలేజీలో అందరికీ ఫోన్ ఉండటం, తనకొక్కడికే లేకపోవడంతో మనస్తాపం చెంది ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తున్నది. ఈ విషాద సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం పసపూడికి చెందిన ఒకరు వ్యవసాయ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న ఆయన కుమారుడు సెలవు రోజున ఇంటికి వచ్చాడు. తనకు స్మార్ట్ ఫోన్ కొనివ్వమని తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. తమకు అంతస్థాయి లేదని తల్లిదండ్రులు చెప్తున్నా వినిపించుకోలేదు. కాలేజీలో తోటి విద్యార్థుల ముందు అవమానం ఎదుర్కొంటున్నానని ఏడుస్తూ ఉన్నాడు. దాంతో రెండు, మూడు రోజుల్లో మొబైల్ కొనిస్తామని తల్లి అతడికి హామీ ఇచ్చింది.
అయితే, తల్లిదండ్రులు తనకు మొబైల్ ఫోన్ కొనివ్వరన్న నిశ్చయానికి వచ్చిన సదరు యువకుడు.. తండ్రి కూలీ పనులకు వెళ్లగా.. తల్లి బయటకు వెళ్లింది చూసి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి గమనించి భర్తకు సమాచారం ఇచ్చింది. దాంతో యువకుడిని రామచంద్రాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దవాఖాన సిబ్బంది, మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మొబైల్ ఫోన్ కోసం కుమారుడు ప్రాణాలు తీసుకోవడం పట్ల తల్లిదండ్రులు బోరున విలపించారు.