అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద(YS Vivekananda) హంతకుడికి ఏపీలోని ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయని సీఎం వైఎస్ జగన్ (CM Jagan) దుయ్యబట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ (YCP) ఆధ్వర్యంలో నిర్వహించిన‘ మేమంతా సిద్ధం’ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
వైఎస్ వివేకాను ఎవరూ చంపించారో కూడా అందరికీ తెలుసని, వివేకా బాబాయ్ను చంపిన హంతకులు జైల్లో ఉండాలి. కానీ చంద్రబాబు మనుషులు మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తపించిపోతున్న నా వాళ్లు కూడా హంతకుడికి నిసిగ్గుగా మద్దతు ఇస్తున్నారని వెల్లడించారు. చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వ్యక్తులతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని పరోక్షంగా వైఎస్ షర్మిల (YS Sharmila), సునిత(Sunitha) గురించి వ్యాఖ్యనించారు.
పేదల అభివృద్ధిని అడ్డుకుంటున్న వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. మే 13న ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అబద్దాలు, కుట్రలకు, మోసాలకు పాల్పడే వారు ఏకమయ్యారని, ప్రజలకు మంచి చేయని పార్టీలన్నీ ఏకమై పోటీ చేస్తున్నాయని ఆరోపించారు. జగన్ అనే ఒక్క వ్యక్తిపై రాష్ట్ర పార్టీలతో పాటు రెండు జాతీయ పార్టీలను తీసుకొచ్చి పోటీ చేస్తున్నాయని అన్నారు. ఒంటరిగా తనను ఎదుర్కొనే ధైర్యం వారికి లేదని విమర్శించారు.