తిరుమల : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి(Kodanda ramaswamy) వారి వార్షిక బ్రహ్మోత్సవా(Brahamotsavam)ల్లో భాగంగా ఆరో రోజు బుధవారం శ్రీరామ చంద్రుడు శివధనుర్భంగాలంకారంలో భక్తుల(Devotees)కు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది.భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
స్వయంవరం(Swayamvaram) సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారమని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, మాన్యుస్క్రిప్ట్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఏఈవో గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ తదితరులు పాల్గొన్నారు.