తిరుమల : తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు (Arjitaseva online tickets) సంబంధించిన 2025 జనవరి (January) నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయన్నారు.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వివరించారు. అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నామని ప్రకటించారు.
అక్టోబరు 23న అంగప్రదక్షిణం టోకెన్లు
జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు,
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు , తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.