తిరుమల : లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల (Tirumala) లోని నాదనీరాజనం వేదికపై ఫిబ్రవరి 11న 7వ విడత అయోధ్యకాండ (Ayodhyakanda) అఖండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ (TTD) వెల్లడించింది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరిగే కార్యక్రమంలో అయోధ్యకాండలోని 22 నుంచి 25వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 155 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 180 శ్లోకాలను పారాయణం చేస్తారని వివరించారు.
ఎస్.వి.వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి.వేద విశ్వవిద్యాలయం, టీటీడీ వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
వేంకటేశ్వరాస్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల సందడి కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 57, 357 మంది దర్శించుకోగా 18, 924 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 3.52 కోట్లు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం 22 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలుగుతుందని చెప్పారు.