తిరుమల : గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో తిరుమల శ్రీవారికి నైవేద్యం, ఇతర ప్రసాదాలు తయారుచేసేందుకు వీలుగా మలి విడతలో 12 రకాల ఉత్పత్తులు సేకరించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్ఫెడ్లతో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి వివరాలను వెల్లడించారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ, మార్క్ఫెడ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తొలివిడతలో 500 మెట్రిక్ టన్నుల శనగలు కొనుగోలు చేయగా మలి విడతలో ప్రస్తుతం బియ్యం, శనగలు, బెల్లం, కందిపప్పు, పెసలు, పసుపు, వేరుశనగ, మిరియాలు, ధనియాలు, ఆవాలు, చింతపండు, ఉద్దిపప్పు సేకరించాలని నిర్ణయించామన్నారు. వీటిని ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి రాష్ట్ర రైతు సాధికార సంస్థ కొనుగోలు చేస్తుందని, ఈ సంస్థ నుంచి మార్క్ఫెడ్ కొనుగోలుచేసి తగిన విధంగా మార్పుచేసి టీటీడీకి అందిస్తుందన్నారు.
టీటీడీ కోసం రైతు సాధికార సంస్థ ఎంపిక చేసిన రైతులు భక్తిశ్రద్ధలతో పంటలు పండించాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రసాయన ఎరువులు వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. క్రమక్రమంగా హోటళ్లు, ఇతర సంస్థలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకురావాలని టీటీడీ ఈవో కోరారు.