తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు వెల్లడించారు.
అక్టోబరు 25న సూర్యగ్రహణం కారణంగా ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 12 గంటలు శ్రీవారి ఆలయ తలుపులు మూసి వేయబడుతాయని, ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు వెల్లడించారు. 24న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు.
నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 నుంచి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతామని, బ్రేక్ దర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని తెలిపారు. అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం రోజుల్లో శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ కి సహకరించాలని కోరారు.