తాడేపల్లి : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ (2022) బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యులు సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరును తప్పుపడుతూ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఎన్టీరామారావు పేరును మార్చడం పట్ల తమ నిరసన వ్యక్తం చేశారు. సవరణ బిల్లు ప్రతులను చింపి స్పీకర్ టేబుల్పైకి విసిరేశారు. దాంతో సభను అదుపులో పెట్టేందుకు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ.. వైద్య రంగ అభివృద్ధికి వైఎస్ఆర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకు ఉచిత వైద్యం అందించారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో వైద్యం, ఆరోగ్యం అధోగతిపాలయ్యాయని దుయ్యబట్టారు. దోమలపై యుద్ధం ప్రకటిద్దామనే కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు, ఇతర నాయకులు.. అసలు దోమలను నివారించే కార్యక్రమాన్ని పక్కనబెట్టి తమ గొప్పలను వల్లెవేయడంలోనే గడిపారని ఎద్దేవా చేశారు.
అనంతరం యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టినందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి మంత్రి ఆర్కే రోజా కృతజ్ఞతలు తెలుపుతూ నిర్ణయాన్ని స్వాగతించారు. బిల్లుపై సీఎం జగన్ మాట్లాడుతూ పేరు మార్పుకు గల కారణాలను వివరిస్తూ వైద్య, ఆరోగ్య రంగాల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన వైఎస్ఆర్ అని పేరు మార్చుతున్నట్లు అభిప్రాయపడ్డారు. చర్చ అనంతరం బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిందని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అనంతరం మండలిలో కూడా ఈ సవరణ బిల్లకు ఆమోదం తెలపడంతో ఎన్టీఆర్ పేరు స్థానంలో ఇకపై డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్య విశ్వవిద్యాలయం అనే పేరు రానున్నది.