అమరావతి: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు ఇప్పటికే వివిధ సేవలను వినియోగిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, చేపట్టే సంక్షేమ పథకాల సమాచారం ఇకపై మరింత వేగంగా ప్రజలకు అందేందుకు మెసేజింగ్ అప్లికేషన్ సంస్థ వాట్సాప్తో జగన్ ప్రభుత్వం చేతులు కలిపింది. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ (ఏపీడీసీ), వాట్సాప్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఇంటర్నెట్ వినియోగదారులు వేగంగా పెరుగుతున్న ఏపీలో ఇలాంటి వేదిక అవసరాన్ని గుర్తించిన వాట్సాప్ ఇండియా సంస్థ.. ఏపీడీసీ వాట్సాప్ వేదికకు పూర్తి సాంకేతిక మద్దతు అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ వేదిక ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, నిర్ణయాల సమాచారం ప్రజలకు వేగంగా చేరవేసే వీలు చిక్కనున్నది. ఇదే సమయంలో తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడానికి కూడా ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడనున్నదని అధికారులు భావిస్తున్నారు. ఈ సేవల విస్తరణలో భాగంగా త్వరలో పూర్తిస్థాయి వాట్సాప్ చాట్ బోట్ సేవలను కూడా ఏపీడీసీ అందించేందుకు సిద్ధమవుతున్నది.
ప్రగతిశీల అజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు సీఎం జగన్.. వాట్సాప్ సంస్థతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావడం హర్షణీయమని ఏపీడీసీ ఉపాధ్యక్షుడు, ఎండీ చిన్న వాసుదేవారెడ్డి తెలిపారు. ప్రభుత్వం- ప్రజల మధ్య డిజిటల్ మాధ్యమం ద్వారా వారధిలా ఉండాలనే ఏపీడీసీ లక్ష్యానికి ఈ ముందడుగు ఎంతో సాయపడుతుందని ఆయన చెప్పారు.