విజయవాడ : తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రాపర్టీ షోలో చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను దుమారాన్ని లేపుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమేనని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒప్పుకోగా.. కేటీఆర్ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నానని సీపీఐ నారాయణ స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా ఏపీ మంత్రి రోజా నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై వీడియోను మీడియాకు విడుదల చేశారు. కాగా, మంత్రులు మాత్రం మూకుమ్మడిగా కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.
ఈ నేపథ్యంలో శనివారం సీపీఐ నేత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుని.. ఇప్పటి నుంచి రోడ్లు, నీరు, విద్యుత్ సరఫరాపై దృష్టి సారించాలని హితవుపలికారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవాలు ఏమున్నాయో వైసీపీ నేతలు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇక్కడి రోడ్ల పరిస్థితి అందరికి తెలుసునని, వైసీపీ నేతలు వాస్తవాన్ని ఒప్పుకోవాలన్నారు. ఏపీ రోడ్లు ఇతర సమస్యల గురించి తమ పార్టీ ఎన్నో మార్లు చెప్పామని, వాటిని పట్టించుకోకుండా కేటీఆర్ అలా మాట్లాడటం తగదని అనడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
పెరుగుతున్న నిత్యావసరాలు, రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న ఆస్తు పన్నుకు నిరసనగా వచ్చే నెల 9 న ఛలో సెక్రటేరియట్ చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. వేలాది మందితో ధర్నా చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు.