అమరావతి: పర్యాటకప్రియులను అలరించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక తీర్థయాత్ర రైళ్లను నడుపుతున్నది. కరోనా ప్రభావం క్షీణించడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే పర్యటనపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో రాజమండి, సామర్లకోట జంక్షన్, తుని, విశాఖపట్నం మీదుగా ఉత్తర భారత యాత్ర నిర్వహించేందుకు రైల్వే శాఖ సర్వం సిద్ధం చేసింది.
కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ దర్శన్’లో భాగంగా ఉత్తర భారత యాత్ర ప్యాకేజీ వివరాలను విజయవాడ ఐఆర్సీటీసీ కార్యాలయంలో డీజీఎం కిషోర్ సత్య, ఏరియా మేనేజర్ కృష్ణ వెల్లడించారు. వచ్చే నెల 19 న రాజమండ్రి నుంచి ఈ రైలు బయల్దేరి సామర్లకోట జంక్షన్, తుని, విశాఖపట్నం మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. 9 రోజులు, 8 రాత్రులు ఉండే ఈ ప్యాకేజీలో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి, అమృత్సర్, హరిద్వార్ వంటి సందర్శనీయ ప్రదేశాలు, ప్రముఖ ఆలయాలను చూపిస్తామని చెప్పారు. ఈ రైలులో 12 స్లీపర్ క్లాస్, ఒక ఏసీ త్రీ టైర్ బోగీతోపాటు ప్యాంట్రీ కార్ ఉంటుందన్నారు. స్లీపర్ క్లాస్లో వెళ్లాలనుకునే వారు రూ.8,510, ఏసీ త్రీ టైర్ కోసం రూ.10,400 చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ప్రభుత్వోద్యోగులు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు.
స్పెషల్ యాత్ర ప్యాకేజీలో భాగంగా యాత్రికులకు ఉదయం టీ, కాఫీతోపాటు అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పిస్తామని వారు తెలిపారు. ఈ ప్యాకేజీ కోసం పర్యాటకులు ఐఆర్సీటీసీటూరిజం.కామ్ వెబ్సైట్లో గానీ, బాలాజి 8287932312, లలిత 9701360675, చందన్ 8287932318, టూరిజం సెల్ 9701360701 నంబర్లలోగానీ స్పందించవచ్చని సూచించారు.