నెల్లూరు : ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి దుయ్యబట్టారు. ఆయన పాలనలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నదని తెలిపారు. మాయ మాటలు చెప్తూ రైతులను ఆందోళనలు చేసేలా టీడీపీ నేతలు పురికొల్పుతున్నారని, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో కూడా క్రాప్ హాలీడే లేదని మంత్రి స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం హయాంలో రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, అమ్మఒడి, ఆసరా, ఈబీసీ నేస్తం వంటి పలు పథకాలను తీసుకొచ్చి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు మంత్రి కాకాణి చెప్పారు. ఇలాంటి పథకాలు ఒక్కటైనా చంద్రబాబు తన పాలనలో తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబువన్నీ దోపిడీ పథకాలే అని, రైతులను అడ్డంపెట్టుకుని దోచుకున్న చరిత్ర చంద్రబాబుది అని మంత్రి కాకాణి మండిపడ్డారు. ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు ఒలకబోస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారని కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వ్యవసాయ మంత్రి కాకాణి స్పష్టం చేశారు. నిజానికి రాష్ట్రంలో రైతులు గతంలో కన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నారని చెప్పారు. రైతుల బాగు కోసం సీఎం జగన్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని, ఆ క్రెడిట్ అంతా జగన్కు రావొద్దనే టీడీపీ నేతలు ఇలా చవకబారు ప్రకటనలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి ఉన్న రైతుల అండను చూసి ఓర్వలేకనే క్రాప్ హాలిడేను విపక్షాలు తెరమీదకు తెచ్చాయని కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకునే దిశగానే పనిచేస్తుందని చెప్పారు.