కాకినాడ జిల్లావాసులను ఓ పులి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. మరోవైపు అటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. గత 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నది. ఇప్పటివరకు ఈ పులి పంజాకు చిక్కి నాలుగు పశువులు మృత్యువాత పడినట్లు తెలుస్తున్నది. పులి జాడ దొరక్కపోవడంతో జిల్లా అటవీ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, తాజాగా ప్రకాశం జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి అడుగుజాడలను గుర్తించినట్లుగా తెలుస్తున్నది. అటవీ ప్రాంతం వైపు నుంచి వెళ్తుందని అధికారులు అంచనా వేయగా.. అది యూ టర్న్ తీసుకుని ఏలేశ్వరం మండలం నుంచి వెనక్కి వచ్చినట్లుగా అధికారులు భావిస్తున్నారు. పులిని బంధించేందుకు నేషనల్ టైగర్ కంజర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) అధికారులు రంగంలోకి దిగారు. కాకినాడ తీర ప్రాంతంలో పులి కనిపించడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు.
గత 20 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న ఈ రాయల్ బెంగాల్ టైగర్ను పట్టుకునేందుకు అటవీ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ పులి తప్పించుకుంటున్నది. పులిని గుర్తించేందుకు 40 ఆధునిక నైట్ విజన్ కెమెరాలను ఏడు గ్రామాల శివారుల్లో పెట్టారు. రెండు రోజుల క్రితం పెద శంకర్లపూడి గ్రామ శివారులో, పోతులూరు గ్రామం వద్ద పులి అడుగుల్ని అటవీ సిబ్బంది గుర్తించారు. ప్రత్తిపాడు మండలంలో దాదాపు 12 కిలోమీటర్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. బోనులో పెట్టిన మాంసం వాసన చూసిన పులి.. దానిని తినకుండానే వెళ్లిపోవడంతో బోనులో చిక్కలేదన్న విషయం కెమెరాల్లో నిక్షిప్తమైంది. గత మూడు వారాలుగా పెద్ద పులి కాకినాడ జిల్లాలో తచ్చాడుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని జిల్లా వాసులు భయపడుతున్నారు.
కాగా, పెద్ద దోర్నాల మండలం పరిధిలోని పెద్ద బొమ్మలాపురం గండి చెరువు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు సమాచారం. మూడు రోజులుగా చెరువు పరిసరాల్లో పులి అక్కడ వ్యవసాయ పనులు చేస్తున్న రైతులకు కనిపించింది. బొమ్మలపల్లి పరిసరాల్లో 15 రోజుల క్రితం పులి అడుగుజాడలను గుర్తించారు. వాటి ముద్రలను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం గండికోట చెరువు ప్రాంతంలో తిష్ట వేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కొత్త ఆవాసం కోసం వెతుక్కుంటూ ఈ పులి ఒడిశా నుంచి కాకినాడ వైపు వచ్చినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఆ మేరకు పులిని బంధించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పులి కోసం అధునాతన బోన్లతో పాటు మూడు మొబైల్ బోన్లు కూడా ఏర్పాటు చేశారు.