అమరావతి : విశాఖపట్నం ( Visaka ) చేపల రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల జాడ ( Fishermen Missing ) ఇంకా తెలియరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ మేకనైజ్డ్ బోటు ఆపరేటర్స్ అసోసియోషన్ కార్యాలయంలో మత్స్యకారుల కుటుంబ సభ్యులు బైటాయించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు రోడ్డుకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారు. 48 గంటలు గడుస్తున్నా తమ సభ్యుల జాడ అధికారులు గుర్తించకపోవడం పట్ల ఆందోళనకు గురవుతున్నారు.
మత్స్యకారులను కాపాడేందుకు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి క్షేమ సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సమాచారం అందుకున్న గత 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుంది. కాగా ఈనెల 1న ఏడుగురు సభ్యులు గల బృందం వేటకు వెళ్లి శనివారం సాయంత్రం తిరిగి బయలు దేరారు. ఈసమయంలో చేపల రేవుకు పది నాటికల్ మైళ్ల దూరంలో ఎత్తైన అల బోటును బలంగా కొట్టడంతో బోటు తిరగబడింది.
అందులోని ఏడుగురు మత్స్యకారులు బోటును పట్టుకుని రాత్రి 9 గంటల వరకు సాయం కోసం ఎదురు చూశారు. ఆధారంగా ఉన్న బోటు చివరికి మునిగిపోవడంతో ఈత కొడుతూ తేలియాడే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోర్టుకు చెందిన వాణిజ్య నౌక కనిపించడంతో నలుగురు దానివైపుగా వెళ్లారు. సమీపంలోకి వెళ్లిన బోటు యజమాని కారి చిన్నను నౌక సిబ్బంది రక్షించారు. అయితే గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల జాడ నేటికి తెలియరాలేదు.