అమరావతి : నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగోన్నతి సాధించిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును చంద్రబాబు వెనుకేసు కొస్తున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అశోక్బాబును అరెస్ట్ చేయడంలో తమ ప్రభుత్వ ప్రమేయం లేదని, సహోద్యోగి ఫిర్యాదుమేరకు లోకాయుక్తా ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు అతడిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తప్పు చేసినా వ్యక్తిని చట్టం ప్రకారం ఎంతటి వారికైనా శిక్ష తప్పదని తెలిపారు.
జిల్లాల పునర్విభజనలో టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా తేల్చాలని డిమాండ్ చేశారు. విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడితే కొందరు టీడీపీ నాయకులు అభ్యంతరం చేయడం విచారకరమని అన్నారు.
నిర్మాణత్మక సూచనలు చేస్తే స్వీకరిస్తామన్నారు. ప్రజల ఆమోదంతో మూడు రాజధానులను కట్టి తీరుతామని కొడాలి నాని స్పష్టం చేశారు. సీఎం జగన్పై గాని ప్రభుత్వంపై గాని ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించబోమని ఆయన హెచ్చరించారు.