విశాఖపట్నం: సింహాచలంలో వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యాలు మెరుగయ్యాయి. ఈ పురాతన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు ఉత్తర ఆంధ్ర నుంచే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. వారంలో దాదాపు 30 వేల మంది పాదచారులు నమోదవుతున్నారు. వారాంతాల్లో ఈ సంఖ్య 45 వేలకు చేరుతున్నది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు మరిన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
వర్షాకాలంలో బస్సులు, ఇతర వాహనాలను పార్కింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ సమస్య పరిష్కారానికి గాను ఆలయం సమీపంలో షెడ్లను నిర్మించారు. దక్షిణ ద్వారం నుంచి అన్నదానం భవన్ వరకు దాతల సహకారంతో 750 అడుగుల మేర షెడ్ సౌకర్యం కల్పించారు. మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిన సింహాచలం దేవస్థానం అధికారులు దాతల సహకారంతో దేవస్థానంలో భక్తులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆలయ అభివృద్ధికి సహకరించేలా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, ఇంజినీరింగ్ అధికారులు దాతలను ప్రోత్సహిస్తున్నారు.
ఇటీవలి కాలంలో సీఎంఆర్ గ్రూప్ మద్దతుతో సింహాచలం ప్రధాన ఆలయంలో ‘ధ్వజస్తంభం’ ఏర్పాటు చేశారు. అదేవిధంగా, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, సీతారామ స్వామి ఆలయానికి ధ్వజస్తంభం కూడా స్థాపించారు. రానున్న రోజుల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సింహాచలం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డీ శ్రీనివాసరాజు తెలిపారు. దేవస్థానం అధికారులు దాతలకు ప్రాధాన్యతనిచ్చినట్లయితే.. ఆలయ అభివృద్ధికి సహకరించేందుకు మరింత మంది దాతలు ముందుకు వచ్చేందుకు ఆస్కారముంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.