విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ ప్రారంభమైంది. విశాఖపట్నంలో ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రి విడదల రజిని ప్రారంభించారు. అగనంపూడిలోని హోమీ భాభా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ను సందర్శించిన మంత్రి అక్కడి రోగులతో మాట్లాడి దవాఖానలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అందిస్తున్న సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సమీపంలోని అగనంపూడి ఏరియా దవాఖానను కూడా మంత్రి సందర్శించారు. అక్కడ గర్భిణులు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బందితో మంత్రి ముచ్చటించారు.
ఈ సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం జియాన్ సంస్థ అందించిన పరీక్ష పరికరాలను మంత్రి విడదల రజిని ప్రారంభించారు. అలాగే, యెండాడ ఎస్సీ బీసీ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భీమునిపట్నం ఎమ్మెల్యే ఎం శ్రీనివాసరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డి నియోజకవర్గానికి ఏడు ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేశారని తెలిపారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాకుండా వైద్య సదుపాయాలను అందించడమే ఈ ఆరోగ్య కేంద్రాల లక్ష్యం అని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జీ లక్ష్మీశ, ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీఎస్ నవీన్ కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కే విజయలక్ష్మి, హోమీ భాభా ఆసుపత్రి ప్రతినిధులు పాల్గొన్నారు.