అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి డబ్బు మాయం కావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. డబ్బు మాయంపై ప్రభుత్వం చెప్పిన కారణాలు సహేతుకంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినేవాళ్లు ఆంధ్రప్రదేశ్ జనాలైతే.. చెప్పేవాడు జగన్ మోసపు రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అవగాహన లేకనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానంటూ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి ఉద్యోగుల డబ్బులు మాయం చేయడంలో మర్మమేంటని ప్రశ్నించారు. సాఫ్ట్ వేర్ సమస్యను సాకుగా చూపి ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా చూస్తున్నారని ఆరోపించారు. నిధులు కరవై చివరకు సచివాలయం సిబ్బంది వసతి సదుపాయాన్ని కూడా ఎత్తేస్తున్నారని విమర్శించారు.
త్వరలో శనివారం సెలవు కూడా రద్దు చేసి ఉద్యోగుల ఆరోగ్యభద్రత కోసమేనని దొంగ మాటలు చెప్తారని లోకేష్ ఫైరయ్యారు. ఇలాంటి మాటలను ప్రభుత్వం ఉద్యోగులు నమ్మడం లేదని, కావాలనే ప్రభుత్వం తమ జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు మాయం చేసిందని వారు గుర్తించారని చెప్పారు. జగన్ మాయ మాటలను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఇంకా ఇలాగే మోసాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.