అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం అమ్ముకునే పరిస్థితులు లేక రైతులు ఎదుర్కొంటున్న దైన్యంపై టీడీపీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. సరైన మద్దతు ధర ఇచ్చి ఖరీఫ్ ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని, ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇంకా 42 లక్షల టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నదని లోకేష్ తన లేఖలో పేర్కొన్నారు.
రాజన్న రాజ్యమంటేనే రైతు రాజ్యమని జగన్ ఇచ్చిన భరోసా.. ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడంలేదని లోకేష్ విమర్శించారు. పొలాల వద్దే పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తాను ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రస్తుత ఖరీఫ్లో రైతాంగం నుంచి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు జరుపకుండానే రబీ కొనుగోలుకు కేంద్రాలను ప్రారంభించడం తీవ్ర అన్యాయమన్నారు.
రైతులకు అవగాహన కల్పించాల్సిన రైతుభరోసా కేంద్రాలు.. వైసీపీ సేవలో తరిస్తున్నాయని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు జరగక అప్పులు, వడ్డీలు పెరిగి రైతులు దయనీయ స్థితిలో ఆందోళనకు గురవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత ఖరీఫ్ ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయడంతోపాటు ధాన్యం బకాయిలను కూడా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు.