Nandyala SP | సైబర్ నేరాలు, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం పండుగ సందర్భంగా ప్రజల్ని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు.. ఫ్రీ గిఫ్ట్ అంటూ మోసం చేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ప్రజలు సైబర్ మోసాల పై అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పారు. ఫ్రీ గిఫ్ట్లకు ఆశపడి ఆకర్షితులైతే సైబర్ నేరగాళ్ల చేతిలో నిలువు దోపిడీకి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
కనుక డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించి జాగ్రత్త పడాలని రఘువీర్ రెడ్డి సూచించారు. యోనో ఎస్బీఐ ఖాతా పేరిట, పాన్కార్డు నంబర్ అప్డేట్ పేరిట చేస్తున్నమోసాల గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల మోసాల బారీన పడకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు.
గుర్తు తెలియని మొబైల్ నంబర్స్ నుండి మీ ఎస్బీఐ యోనో అకౌంట్ బ్లాకైందని, మీ పాన్కార్డు నంబర్ అప్డేట్ చేసుకొనేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి’ అని సందేశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ రఘువీర్ రెడ్డి సూచించారు. ఫ్రీ గిఫ్ట్ అంటూ మెసేజ్లు వచ్చినప్పుడు ఆ మెసేజ్లో ఉన్న లింక్ ని క్లిక్ చేయవద్దన్నారు. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా నంబర్లు, పాస్వార్డులు తెలుపొద్దని చెప్పారు.
ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే వచ్చే భక్తుల క్షేమం కోసం నంద్యాల జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో పటిస్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బందోబస్తు విధులు నిర్వహిస్తున్నప్పుడు అలసత్వం ఉండరాదని ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
నంది మండపం, నంది సర్కిల్, మల్లమ్మ కన్నీరు, స్నాన ఘట్టాలు, పాతాళగంగ, రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాహనాలను తొలగించి వాహన రాకపోకలకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. నిత్యం గస్తీ, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 10 బ్లూ కోట్స్ ఏర్పాటు చేశారు.
అనంతరం టోల్ గేట్,నంది సర్కిల్, మల్లికార్జున సత్రం, నంది మండపం, పాతలగంగ మొదలగు ప్రాంతాల్లో పర్యటించి భద్రత ఏర్పాట్లు పరిశీలించి భద్రత చర్యలలో తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ ఆర్ రమణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ దస్తగిరి బాబు, శ్రీశైలం సీఐ దివాకర్ రెడ్డి, శ్రీశైలం ఎస్ఐ లక్మణరావు పాల్గొన్నారు.