Srisailam Sea Plane | రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని నంద్యాల జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి చెప్పారు. ఇందులో భాగంగానే సీప్లేన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు శ్రీశైలానికి వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం శ్రీశైలం స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తో పాటు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్, జాయింట్ కలెక్టర్ సీ విష్ణు చరణ్లతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
పాతాళ గంగ – బోటింగ్ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ జీ రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ విజయవాడ-కృష్ణా నది పున్నమి ఘాట్ నుంచి విజయవాడ – శ్రీశైలం మధ్య సీప్లేన్ ప్రారంభానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారన్నారు. విజయవాడలో ప్రారంభమైన సీప్లేన్ నల్గొండ టన్నెల్ వద్ద ల్యాండ్ అయి పాతాళ గంగ బోటింగ్ పాయింట్ వద్ద ప్లాస్టిక్ జెట్కు రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు శ్రీశైలానికి చేరుకుంటారని తెలిపారు. అటుపై భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సీఎం సందర్శిస్తారని అన్నారు. ఇందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు, గ్రీన్ రూమ్, వీఐపీల సీటింగ్ అరేంజ్మెంట్ తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
అంతకుముందు రోప్ వే ఎంట్రీ పాయింట్ వెలుపల ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి ఎల్ 1, గ్రీన్ రూమ్ ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీ అధికారులను కలెక్టర్ జీ రాజకుమారి ఆదేశించారు. త్రాగునీటి వసతి, పార్కింగ్, తాత్కాలిక టాయిలెట్ల ఏర్పాట్లకు కూడా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సూచించారు. శ్రీశైలం దేవస్థానంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీలు దేవస్థాన ఈఓతో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. పాతాళ గంగ బోటింగ్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ జెట్ ను పరిశీలించారు. ల్యాడర్కు డెకరేషన్ చేయాలన్నారు. రోప్ వే భవనం, క్యాబిన్, నడకదారుల్లో ముమ్మర పారిశుధ్య చర్యలు చేపట్టి పెయింటింగ్ వేసి ఆకర్షణీయంగా తీర్చి దిద్దాలని అన్నారు. ఏర్పాట్లలో తేడా వస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించారు.
రోప్ వే పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ, దేవస్థాన అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ప్లాస్టిక్ జెట్ ఏర్పాటుతో పాటు ల్యాడర్ కు డెకరేషన్, రోప్ వే భవనం, క్యాబిన్, నడకదారుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి పెయింటింగ్ వేసి ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దాలన్నారు.