తిరుమల : ప్రముఖ సినీనటి నమిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని సాక్షాత్ ఏడుకొండల స్వామి చెంత ప్రకటించింది. నటి నమిత దంపతులు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఆలయ అధికారులు దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు.
దర్శనానంతరం ఆలయం వెలుపల నమిత మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అందరూ క్షేమంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని కోరుకున్నానని తెలియజేసింది. చేయబోయే కొత్త సినిమాల గురించి మాట్లాడుతూనే రాజకీయాలపై ఆసక్తి ఉందని ఆమె పేర్కొన్నారు.