విజయవాడ: ఒక సినిమాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించడం కోసం ప్రభుత్వం యత్నించడం ఇదే తొలిసారి అని, తానూ ఇప్పుడే చూస్తున్నానని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. భీమ్లా నాయక్ సినిమాకు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఫ్యాన్స్ విజయవంతం చేస్తారని గుర్తు చేశారు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. ఆత్మగౌరవం ఉన్న వాళ్లు అంతా వైసీపీ నుంచి బయటకు రావాలని మనోహర్ పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు నమ్మి అధికారాన్ని ఇస్తే.. జగన్ ఇలాంటి ప్రజా వ్యతిరేక పాలనను అందిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా క్షేత్రస్థాయిలో జరిగిన అధికార దుర్వినియోగాన్ని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతున్నదని చెప్పారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెప్పిన జగన్.. పవన్ కల్యాణ్ నటించిన సినిమా విషయంలో మాత్రం అభిమానులను నిరుత్సాహపర్చేలా వ్యవహరించారన్నారు. అధికారులను అడ్డం పెట్టుకుని థియేటర్ల వద్ద భయభ్రాంతులు సృష్టించారని చెప్పారు.
కక్ష పూరితంగా, నియంతలా వ్యవహరిస్తూ తన ఆలోచన మేరకు అధికారులు పనిచేయాలనడం జగన్ కు తగదని నాదెండ్ల మనోహార్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీ నాయకులు ఇప్పటికైనా ఆత్మగౌరవంతో బతికేందుకు వెంటనే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనా హుందాగా వ్యవహరించడం పట్ల పవన్ కల్యాణ్ అభిమానులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.