నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై తాను భారీ మెజార్టీతో విజయం సాధించడం జగన్ పనితీరుకు నిదర్శనమన్నారు మేకపాటి విక్రమ్రెడ్డి. 80 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనను గెలిపించిన ఆత్మకూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని మరోసారి స్పష్టంచేశారు.
తన విజయం కేవలం జగన్ అమలు చేస్తున్న పథకాల వల్లనే సాధ్యమైందని, ఆయన పనితీరు వల్లనే ఇంత మెజార్టీ వచ్చిందని మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. మా కుటుంబంపై నమ్మకం ఉంచి తనను గెలిపించిన ఆత్మకూరు ఓటర్లకు సదా రుణపడి ఉంటామని చెప్పారు. గౌతమ్ అన్న పేరు నిలబెట్టేలా ప్రజలకు సేవచేస్తానన్నారు. ఇప్పుడు తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.
మంచికి మద్దతుగా నిలిచారు: సీఎం జగన్
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి విక్రమ్రెడ్డి ఘన విజయంపై ముఖ్యమంత్రి జగన్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్కు నివాళిగా ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ను దీవించారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పేరుపేరునా ధన్యవాదాలు! మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష!’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
టీడీపీ కుట్రలు చేసింది: మంత్రి అంబటి
ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఇంత భారీ మెజార్టీతో గెలుపొందడం గొప్ప విషయమని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతీ ఎన్నికకూ వైసీపీ ఓటింగ్ శాతం పెంచుకుంటూ పోతున్నదని చెప్పారు. ఉప ఎన్నికలో టీడీపీ పోటీలో లేకున్నా చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. మద్యంపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భూమ్ భూమ్, ప్రెసిడెంట్ మెడల్ వంటి మద్యం బ్రాండ్లు టీడీపీ హయాంలోనే వచ్చాయని గుర్తుచేశారు.