శ్రీశైలం : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు(Brahmotsavam) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగవరోజు సోమవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి( Mahashivaratri ) వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
ఆలయ చైర్మన్ రెడ్డివారిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం(Rudra Homam), చండీహోమం నిర్వహించారు. సాయంత్రం హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మయూర వాహనంపై ఉంచి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు. మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో ఆలయోత్సవంతోపాటు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు.
స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల( Chenchu artisans) జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు,శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, ఈఈ రామకృష్ణ, పీఆర్వో శ్రీనివాసరావు, ఏఈవోలు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.