YS Viveka | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో కడప ఎంపీ అవినాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాకు 2006 నుంచే ఓ మహిళతో సంబంధం ఉన్నదని, దీంతో ఆమెను పెండ్లి చేసుకునేందుకు ముస్లిం లా ప్రకారం వివేకా తన పేరును షేక్ మహ్మద్ అక్బర్గా మార్చుకున్నారని శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వీరిద్దరికి ఓ కొడుకు పుట్టడంతో అతనికి షేక్ షహన్షా అని పేరు పెట్టారని, తన రాజకీయ వారసత్వాన్ని ఆ అబ్బాయికే అప్పగించాలనే ఆలోచన వివేకాకు ఉండేదని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే వివేకా కుటుంబంలో గొడవలు జరిగి, హత్యకు దారితీసి ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ హత్య జరిగిన సమయంలో కొందరు వివేకా ఇంటిలో డాక్యుమెంట్ల కోసం వెతికినట్టు నిందితులు తమ వాంగ్మూలంలో చెప్పారని అవినాశ్రెడ్డి గుర్తుచేస్తూ.. బహుశా వారు షహన్షాకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్ల కోసమే వెతికి ఉండవచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆస్తి తగాదాల్లో భాగంగానే వివేకా హత్య జరిగినట్టు భావిస్తున్నానని తెలిపారు. సీబీఐ అధికారులు ఈ కోణంలో విచారణ జరపడం లేదని, అక్రమంగా తనను ఈ కేసులో ఇరికించేందుకు కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు.
వివేకా హత్య జరిగిన స్థలానికి వెళ్లాలని ఆయన కుమార్తె, అల్లుడే తనకు చెప్పారని, హత్యా స్థలంలో వారికి దొరికిన లేఖను ఎవరికీ ఇవ్వకపోవడం పెద్ద నేరమని ఆరోపించారు. వివేకా గుండెపోటుతో మరణించినట్టు తాను ఎప్పుడూ చెప్పలేదని, ఇది టీడీపీ ప్రభుత్వం సృష్టించిన కట్టుకథ అని తెలిపారు. వివేకా మరణం గురించి పోలీసులకు తానే సమాచారం అందించానని, దీని వెనుక దాగివున్న రాజకీయ కుట్రలను తప్పకుండా ఛేదిస్తామని అవినాశ్రెడ్డి చెప్పారు.