అమరావతి: బీజేపీతో టీడీపీ అంటకాగడంపై, రాజకీయంగా ఒక్కటవుతున్న వైనంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా రెండు పార్టీలను ఏకిపడేశారు. దరిద్రాన్ని కోరి ఎవరు కూడా చంకన పెట్టుకోరంటూ టీడీపీతో బీజేపీ స్నేహంపై ట్వీట్ సంధించారు. రాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్ షా.. పార్టీ బహిరంగ సభకు వచ్చి ఓ పత్రికాధిపతితో భేటీ అయిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
బీజేపీని చంద్రబాబు చేరదీస్తారా? లేదా? అనేది బీజేపీ, టీడీపీల అంతర్గత విషయమన్నారు. విలువల్లేని టీడీపీతో బీజేపీ పొత్తు పొట్టుకుంటుందని తాను భావించడం లేదన్నారు. అలా బీజేపీ తన స్థాయిని దిగజార్చుకోదన్నారు. బీజేపీతో జతకట్టి టీడీపీ తన పరిస్థితిని మరింత దిగజార్చుకుంటుందా? అనేది ఆ పార్టీ నేతలు నిర్ణయించుకోవాలని చెప్పారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఓ పత్రికాధిపతితో భేటీ అవ్వడంతో మళ్లీ టీడీపీతో బీజేపీ పొత్తుకు సిద్ధమయిందన్న ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనపడుతుంది.