హైదరాబాద్ : సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బుధవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. రఘురామ ఆరోగ్యం కోలుకోవడంతో.. ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలో బయల్దేరి వెళ్లారు ఎంపీ రఘురామ. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ర్ట సీఐడీ అధికారులు రఘురామను అరెస్టు చేసి గుంటూరుకు తరలించిన సంగతి తెలిసిందే.
అయితే తనను సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ ఎంపీ నేరుగా సుప్రీంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశానుసారం రాఘురామకృష్ణరాజుని ఆర్మీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అనంతరం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం రఘురామకృష్ణరాజుకు బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఎంపీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొన్న విషయం విదితమే.