అమరావతి : రాజద్రోహం కేసులో తన అరెస్టు, తదనంతర పరిణామాలపై నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నిరాష్ట్రాల గవర్నర్లకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు మంగళవారం లేఖలు రాశారు. త్వరలో గవర్నర్ల సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆయన అందరికీ లేఖలు రాశారు. సదస్సులో సెక్షన్ 124ఏ రద్దు చేసే అంశంపై చర్చించాలని గవర్నర్లను ఆయన కోరారు. రాజద్రోహం సెక్షన్ దుర్వినియోగం అవుతున్నదని రఘురామ లేఖలో పేర్కొన్నారు. వైఫలాలను ప్రస్తావించినందుకే ఏపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది. ఏపీ సీఎం వ్యక్తిగత కక్షతో కేసులు పెట్టించారని ఆయన ఆరోపించారు. ఏపీ సీఐడీ కార్యాలయంలో అదనపు డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో తనను క్రూరంగా హింసించారని తెలిపారు. సిట్టింగ్ ఎంపీపై దేశద్రోహం నేరం మోపడం, కస్టడీలో హింసించడం ఇదే తొలిసారని వెల్లడించారు. విషయాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని, త్వరలో రాష్ట్రపతి అధ్యక్షత జరిగే సమావేశంలో తనకు మద్దతు తెలపాలని ఆయన కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.