అమరావతి : సోషల్ మీడియాలో వైరల్గా మారిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ వ్యవహారంపై సీపీఐ నాయకుడు రామకృష్ణ మండిపడ్డారు. వెంటనే ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉంటూ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఆయన తప్పుబట్టారు. మాధవ్ వ్యవహారం ఢిల్లీలోని ఎంపీల సెల్ఫోన్లోనూ చకర్లు కొడుతుందని తెలిపారు.
తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో దెబ్బతీశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం నరేంద్ర మోదీ, అమిత్ షాకు లొంగిపోయి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సమస్యలపై పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. విభజన హామీలు,విశాఖ ఉక్కు కర్మాగారం గురించి కేంద్రంతో పోరాడడం లేదని అన్నారు. కేంద్రంతో పోరాడేది ఏమీ లేనందున వైసీపీ నాయకులందరూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.