అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 2024 లో జరుగుబోయే ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవు తున్నాయి. దీంట్లో భాగంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఇంకా ఎన్నికలకు 18 నెలల సమయం ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు వ్యూహాన్ని అమలు చేయడానికి పావులు కదుపుతున్నాయి. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కొద్దిమందికి అభయమివ్వగా మరికొంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే కోవలో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునను విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ ఎంపీగా పోటీలో దింపేందుకు వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 2014, 2019 లో వైసీపీ అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్. పొట్లూరి వరప్రసాద్ లు విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు.
రాబోయే 2024 లో అయినా ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని అందుకు ఇప్పటినుంచే వైసీపీ పెద్దలు నేతల అన్వేషణలో పడ్డారు . ఈ మేరకు నాగార్జున పేరును కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు.