పశ్చిమ గోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పర్యటించనున్నారు. అల్లూరి సీతారామ రాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, గత శనివారం రాత్రి నుంచి భీమవరంలో కురుస్తున్న వర్షం మోదీ సభకు తీవ్ర ఆటంకాలు సృష్టిస్తున్నది.
భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం 16 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. లక్ష మంది వరకు ఈ సభకు హాజరవుతారని అంచనా వేశారు. అయితే, గత శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సభా ప్రాంగణం బురదమయంగా తయారైంది. బహిరంగ సభ జరిగే ప్రాంతంలో వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తోడేస్తూ బురదను మట్టికప్పే పనులు చేపడుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురియడంతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. వేదిక వద్ద కూడా బురద మయంగా మారింది. నిర్వాహకులు వర్షంలోనే సభా ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలుకనున్నారు. గన్నవరం నుంచి భీమవరం వరకు హెలీకాప్టర్లో ప్రధాని మోదీతోపాటు గవర్నర్, ఏపీ సీఎం కూడా ప్రయాణించనున్నారు. ప్రధాని మోదీతో వేదికను గవర్నర్, ఏపీ సీఎం జగన్ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, చిరంజీవి పంచుకోనున్నారు. ఇలాఉండగా, ప్రధాని మోదీని అల్లూరి సీతారామరాజు బంధువులు కలువనున్నారు. అల్లూరి సోదరుడు, సోదరి మనుమలు, మునిమనవళ్లు మొత్తం 37 మంది మోదీతో భేటీ అవుతారు. వీరితో కాసేపు మోదీ ముచ్చటిస్తారు.